నేతలు కూర్చుంటే వాగ్దానాలు గుర్తు చేసే కృత్రిమమేధ కుర్చీ!


→ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన ఐటీఎం ఇంజినీరింగ్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు రాజకీయ నాయకులకు వారి బాధ్యతను గుర్తుచేసే అద్భుతమైన కుర్చీని రూపొందించారు.
→ కృత్రిమమేధ (ఏఐ)తో పనిచేసే ఈ మ్యాజికల్‌ చైర్‌పై నాయకులు కూర్చోగానే ఎన్నికల సమయంలో వారు చేసిన వాగ్దానాలు గుర్తు చేస్తుంది.
→ ఈ కుర్చీని సామాజిక మాధ్యమాలకు అనుసంధానం చేశారు. అందులో ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రజలు వ్యక్తం చేసిన మంచి లేదా చెడు అభిప్రాయాలనుబట్టి కుర్చీలో ఏర్పాటుచేసిన ఎరుపు, ఆకుపచ్చ లైట్‌ ఇండికేటర్ల ద్వారా ఆయా నేతల పనితీరును అంచనా వేస్తామని ప్రణవ్‌ తెలిపాడు. ‘‘కుర్చీకి సెన్సర్లు అమర్చాము. తనపై కూర్చొన్న నాయకుడు ఎవరనేది ముందుగా అది గుర్తిస్తుంది. తర్వాత నేతలకు ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంది.
→ వారికున్న ప్రజాదరణ, ప్రజల అసంతృప్తి అన్నీ బయటపెడుతుంది.
→ ఈ కుర్చీ కోసం ఒక ఆండ్రాయిడ్‌ మొబైల్, ఎరుపు, ఆకుపచ్చ సూచికలు, కేబుల్, ఫైబర్‌ కుర్చీ, పీసీబీ బోర్డు, బ్యాటరీ మొదలైనవి ఉపయోగించాం’’ అని విద్యార్థులు తెలిపారు.
→ ఈ ఏఐ ఛైర్‌ భవిష్యత్తులో మరింత స్మార్ట్‌గా మారనుంది. రూ.35 వేలు వెచ్చించి 15 రోజుల్లో దీనిని రూపొందించిన విద్యార్థుల కృషిని గోరఖ్‌పుర్‌లోని మదన్‌మోహన్‌ మాలవీయ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ ఎన్‌కే సింగ్‌ ప్రశంసించారు.