ఏడాది తర్వాత ‘అంగారక ఆవాసం’ నుంచి వెలుపలికి..!


→ అంగారక గ్రహంపైకి మానవసహిత యాత్ర చేపట్టడానికి సన్నాహకంగా నిర్వహించిన ఒక ప్రయోగం ముగిసింది.
→ ఇందులో భాగంగా ఏడాదిపాటు ఒక కృత్రిమ ఆవాసంలో ఉన్న సిబ్బంది.. తాజాగా వెలుపలికి వచ్చారు.
→ అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ అంతరిక్ష కేంద్రంలో ఇది జరిగింది.
→ ఈ ప్రయోగంలో నలుగురు వాలంటీర్లు 12 నెలల పాటు.. అంగారక వాతావరణాన్ని పోలి ఉండే ఒక ఆవాసంలో గడిపారు.
→ త్రీడీ ముద్రణ ద్వారా రూపొందిన ఈ శిబిరం విస్తీర్ణం 1700 చదరపు అడుగులు. గత ఏడాది జూన్‌ 25న వాలంటీర్లు ఇందులోకి ప్రవేశించారు.
→ వీరిలో కెల్లీ హ్యాస్టన్‌ మిషన్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అందులో అంగారక గ్రహంపై ఉన్న పరిస్థితులను కృత్రిమంగా ఏర్పరిచారు.
→ ‘క్రూ హెల్త్‌ అండ్‌ పెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఎనలాగ్‌’ (సీహెచ్‌ఏపీఈఏ) పేరిట ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
→ పరీక్షార్థులు.. ఇందులో సిమ్యులేటెడ్‌ స్పేస్‌వాక్‌లు (మార్స్‌వాక్‌లు) నిర్వహించారు. తమ ఆహారం కోసం కూరగాయలను పండించారు.
→ అంగారక గ్రహంపై ఉన్నప్పుడు వ్యోమగాములకు ఎదురయ్యే అవకాశం ఉన్న సవాళ్లపై వీరు కసరత్తు చేశారు.
→ ఇందులో ఒంటరితనం, భూమిపై ఉన్న మిషన్‌ కంట్రోల్‌ కేంద్రంతో జరిపే కమ్యూనికేషన్లలో 22 నిమిషాల జాప్యం వంటివి ఉన్నాయి.
→ పుడమికి, అంగారక గ్రహానికి మధ్య ఉన్న దూరం వల్ల ఈ ఆలస్యం జరుగుతుంది.
→ పోషకాహారం, దానివల్ల వ్యోమగాములపై పడే ప్రభావం వంటి అంశాలపైనా దృష్టిసారించారు.