ఐఎస్‌ఎస్‌కు చేరిన సునీత, విల్‌మోర్‌




భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) చేరుకున్నారు.
→ వీరిని రోదసిలోకి తీసుకెళ్లిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రంతో క్షేమంగా అనుసంధానమైంది.
→ బోయింగ్‌ సంస్థ రూపొందించిన ఈ క్యాప్సూల్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర.
→ అంతకుముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్‌ - కంట్రోల్‌ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఇది ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కాగలిగింది.
→ ఆ సమయంలో ఈ అంతరిక్ష కేంద్రం.. దక్షిణ హిందూ మహాసముద్రానికి ఎగువన 400 కిలోమీటర్ల ఎత్తులో విహరిస్తోంది.
→ ఐఎస్‌ఎస్‌కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్‌మోర్‌లు కొద్దిసేపు పరీక్షించారు.
→ మార్గమధ్యంలోనూ ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది.
→ అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్‌ ప్రతినిధి తెలిపారు.
→ వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు.