పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
→ పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది.→ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) విధానంలో ఈ ఉపకరణం వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ఒక చిన్న పేస్ మేకర్ తరహా పరికరాన్ని వినియోగిస్తారు. ఈ పరికరం సన్నని తీగల ద్వారా మెదడులోని ఎంపిక చేసిన ప్రదేశాలకు ఎలక్ట్రికల్ సంకేతాలు పంపిస్తుంది. మెదడులోని సంకేతాలను కూడా ఈ పరికరం గుర్తిస్తుంది. పార్కిన్సన్ వ్యాధి ఒకసారి వచ్చాక, నెమ్మదిగా పెరుగుతూ పోవడం తప్పిస్తే, తగ్గడం అనేది తక్కువ. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ వ్యాధిగ్రస్తులు ఎంతో ఇబ్బంది పడతారు. తీవ్రమైన మానసిక వైకల్యానికి లోనుకావలసి వస్తుంది. ‘మెదడులో నరాల తీరుతెన్నులను కచ్చితంగా లెక్కగట్టి, దానికి అనువైన సంకేతాలను పంపిస్తూ రోగికి ఉపశమనం కలిగించడంలో ఈ పరికరం సత్ఫలితాలు ఇస్తోందని’, ఈ పరికరంతో చికిత్స చేసిన డాక్టర్ జి.రఘురామ్ (బెంగళూరు) తెలిపారు. కృత్రిమ మేధను జోడించినందున మెరుగ్గా ఉపయోగపడుతుందని మెడ్ట్రానిక్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ప్రతీక్ తివారీ వివరించారు.
→