వనమూలికతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్
→ ఒక వన్యప్రాణి తన శరీరంపైనున్న గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు.→ ఇండోనేసియాలోని సువాక్ బాలింబింగ్ పరిశోధన కేంద్రంలో ఇది చోటుచేసుకుంది.
→ అది రక్షిత వర్షాధార అడవి. తీవ్రంగా అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న 150 సుమత్రన్ ఒరాంగుటాన్లు అక్కడ ఉన్నాయి.
→ రోజువారీ తనిఖీల్లో భాగంగా ఆ జీవులను నిపుణులు ఇటీవల పరిశీలించారు.
→ అప్పుడు రాకుస్ అనే మగ ఒరాంగుటాన్ ముఖానికి గాయమైనట్లు గమనించారు.
→ మూడు రోజుల తర్వాత, ఆ జీవి.. ఫైబ్రారేరియా టింకోటోరియా అనే మొక్కను ఎంచుకొని, దాని ఆకులను సేకరించింది. వాటిని బాగా నమిలింది.
→ ఈ క్రమంలో వెలువడిన రసాన్ని గాయంపై కొద్ది నిమిషాలపాటు పులిమింది. చివరిగా.. ఆకుల పిప్పితో ఆ గాయాన్ని పూర్తిగా కప్పేసింది.
→ రాకుస్ ఉపయోగించిన మొక్క ఆగ్నేయాసియాలోని అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నొప్పి నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలు అందులో ఉన్నాయి.
→ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణంతోపాటు గాయాన్ని నయం చేసే అనేక ఇతర లక్షణాలు దీని సొంతం. రాకుస్కు గాయం వద్ద ఇన్ఫెక్షన్ తలెత్తలేదు.
→ ఐదు రోజుల్లోనే అది పూడుకుపోయింది. నెల రోజుల్లో పూర్తిగా మానిపోయింది. ఈ ఒరాంగుటాన్.. సాధారణం కన్నా ఎక్కువసేపు నిద్రించడాన్ని కూడా పరిశోధకులు గమనించారు. నిద్ర వల్ల ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్లు, ప్రొటీన్ సింథసిస్, కణ విభజన పెరుగుతాయని, ఫలితంగా గాయం త్వరగా మానిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చికిత్స ఉద్దేశంతోనే రాకుస్ ఇలా చేసిందని వివరించారు. నిర్దిష్టంగా గాయంపైనే పసరు రాయడాన్ని బట్టి ఇది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. గాయం నయమయ్యే వరకూ ఈ చికిత్సను అది కొనసాగించిందన్నారు.
→