హెచ్సీఏపై సుప్రీం కోర్టు కమిటీ పర్యవేక్షణ
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)కు సంబంధించిన అన్ని వ్యవహారాలను తాము నియమించిన కమిటీ పర్యవేక్షిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హెచ్సీఏ అంబుడ్స్మన్-కమ్-ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమిస్తూ హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హెచ్సీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
‣ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సీటీ రవికుమార్తోకూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ను విచారించింది. జస్టిస్ కక్రూ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రస్తుత కార్యవర్గ నిర్ణయాలను సమీక్షించే అధికారం జస్టిస్ కక్రూ నేతృత్వంలోని కమిటీకి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.